రాయదుర్గం: HLC ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకపోతే పోరాటమే : మెట్టు గోవిందరెడ్డి
హెచ్ఎల్సీ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి డిమాండ్ చేశారు. కణేకల్ మండలంలోని అంబాపురంలో ఆయన మాట్లాడుతూ కళ్లముందే కాలువలో నీరు వెళుతున్నా పంటలకు నీరు పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తుంగభద్ర డ్యాం లో ఆశాజనకంగా నీరు నిల్వ ఉన్నందున సాగుకు విడుదల చేయాలని కోరారు. మూడు నాలుగు రోజుల్లో ఐఏబి మీటింగ్ ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కి నిరసన చేపడతామని స్పష్టం చేశారు. ఆపార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గరుడచేడు గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.